ఎల్కతుర్తి (హనుమకొండ) : హనుమకొండ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గురువారం రాత్రి లారీ అదుపుతప్పి కారును ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం ప్రాంతానికి చెందినవారు.. సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజన్న దర్శనానికి గురువారం రాత్రి కారులో బయలుదేరివెళ్లారు. పెంచికల్ పేట వద్ద ఎదురుగా వస్తున్న లారీ అదుపుతప్పి వీరి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంతెన కాంతమ్మ (72), మంతెన శంకర్ (68), మంతెన భరత్ (29), మంతెన చందన (16) అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న సిఐ ప్రవీణ్కుమార్, ఎస్సై రాజ్కుమార్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రేణుక, భార్గవ్, శ్రీదేవిలను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/accident-4.jpg)