- ఐదుగురు వలస కార్మికులు దుర్మరణం
ప్రజాశక్తి-బిట్రగుంట : శ్రీరామనవమి సామగ్రి కొనేందుకు వెళ్తుండగా ఐదుగురు వలస కార్మికులు దుర్మరణం చెందారు. ఆగి ఉన్న లారీని కారు ఢకొీట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా బోగోలు మండలం మంగమూరు రోడ్డులో జాతీయ రహదారిపై మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. నెల్లూరు జిల్లా జలదంకి మండలం చామదల గ్రామ ఎస్సి కాలనీకి చెందిన ఒకే కుటుంబ సభ్యులు గంట రమణమ్మ, దావులూరి శ్రీనివాసులు, దావులూరి వరలక్ష్మి, గంటా నీలిమ, గంట నందూరు వలస కార్మికులుగా హైదరాబాద్లో ఉంటున్నారు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా సొంత ఊరు చామదలకు వచ్చారు. పండగ సామగ్రి కొనేందుకు వారు కారులో కావలికి బయలుదేరారు. బోగోలు నుంచి కావలికి వెళుతుండగా ముంగమూరు రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని కారు అతివేగంగా ఢకొీంది. దీంతో కారు ముందు భాగం లారీ వెనక భాగంలో ఇరుక్కుపోయింది. కారులో ఉన్న ఐదుగురి తలలకు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే వారు మృతి చెందారు. సంఘటన స్థలానికి కావలి డిఎస్పి వెంకటరమణ, రూరల్ సిఐ నాగభూషణం, శ్రీనివాసులు చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కావలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.