ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఎపిపిఎస్సి) విడుదల చేసిన గ్రూప్-2 పోస్టులకు ఆదివారం స్క్రీనింగ్ పరీక్ష జరగనుంది. మొత్తం 897 పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 4.80లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో 1327 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్క్రీనింగ్ జరగనుంది. పరీక్ష నిర్వహణ ఏర్పాట్లుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పిలతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పరీక్షల తీరును నిరంతరం పర్యవేక్షించేందుకు సిసి టీవీ కెమెరాలు, 24 మంది ఐఎఎస్ అధికారులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీరితో పాటు 450 మంది రూట్, 1300 మంది లైజనింగ్ అధికారులను నియమించామన్నారు. 24,142 మంది ఇన్విజిలేటర్లు, మరో 8,500 మంది ఇతర సిబ్బందిని పరీక్షా కేంద్రాల్లో నియమించామన్నారు. 3,971 మంది పోలీస్ సిబ్బందిని, 900 మంది ఎస్కార్ట్ సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/02/group-2-2.jpg)