ప్రజాశక్తి-అమరావతి : సిఎం వైఎస్ జగన్ ఆయన బంధువులకు, వాళ్ల కంపెనీలకు వేల కోట్ల రూపాయల ఆయాచిత లబ్ధి చేకూరేలా వైసిపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిల్పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ప్రతివాదుల్లోని పలువురు ప్రచారం కోసమే ఈ పిల్ వేశామని అంటున్నారని, ఈ పిల్పై లోక్సభ ఎన్నికల తర్వాత విచారణ చేపట్టినా తమకు అభ్యంతరం లేరని పిటిషనరు తరపున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు చెప్పారు. వాయిదాకు కారణాలను వివరిస్తూ మెమో దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను ఈ నెల 19కి వాయిదా వేస్తూ జస్టిస్ దుర్గాప్రసాదరావు, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ఉత్తర్వులు జారీ చేశారు. విచారణకు హాజరైన ఎంపి రఘురామ కోర్టు బయట విలేకరులతో మాట్లాడారు. వైసిపిని ఓడించేందుకు ప్రజలంతా బయటకు వచ్చి ఓట్లు వేయాలని కోరారు. ఎన్ని వ్యూహాలు పన్నినా, ఎన్ని కుట్రలు చేసినా వైసిపి ప్రభుత్వం కూలిపోతుందని అన్నారు. మరో కేసులో విచారణకు హాజరైన కెఎ పాల్తో రఘురామ కొద్ది నిమిషాలు మాట్లాడారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/ap-highcourt.jpg)