సిద్దిపేట (తెలంగాణ) : సిద్దిపేట విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలడంతో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. సబ్ స్టేషన్లో అగ్ని ప్రమాదం కారణంగా సిద్దిపేట పట్టణంతోపాటు పరిసర మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమీపంలోని ట్రాన్స్ఫార్మర్లకు కూడా మంటలు వ్యాపించడంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండడంతో ప్రాణ నష్టం జరగలేదు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు హైదరాబాద్ నుంచి ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాద ఘటనపై ఎమ్మెల్యే హరీశ్రావు, దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి విద్యుత్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/02/fire-accident.jpg)