మంచి నీళ్లు అడిగితే ట్రాక్టర్‌తో తొక్కించి చంపేస్తారా ? : లోకేశ్‌

Mar 2,2024 10:16 #incident, #Nara Lokesh, #palnadu, #serious

అమరావతి : మంచి నీళ్లు అడిగితే ట్రాక్టర్‌తో తొక్కించి చంపేస్తారా ? అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లాలోని మాచర్లలో నీళ్లు పట్టుకోడానికి వచ్చిన ఓ ఎస్టీ మహిళను వైసిపి సర్పంచి అనుచరుడు ట్రాక్టరుతో ఢకొీట్టి చంపేసిన ఘటనపై లోకేశ్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మాచర్లలో ఆటవిక రాజ్యం నడుస్తోందని నిప్పులుచెరిగారు. ట్యాంకర్‌ వద్దకు వచ్చిన సామినిబాయి (50)ని వైసిపి సైకో చంపేశాడని, ట్రాక్టర్‌తో తొక్కించి అత్యంత కిరాతకంగా ఆమె ప్రాణాలు తీయడం కలచివేసిందని లోకేశ్‌ అన్నారు. నీటి కోసం వచ్చిన మహిళను టిడిపికి చెందిన వ్యక్తివంటూ బెదిరించారని.. నీటితో పార్టీలకు సంబంధమేంటని ప్రశ్నించడమే ఆమె చేసిన నేరమా ? అని ప్రశ్నించారు. ” ఇలాంటి ఘటనలు చూస్తుంటే.. మనం ఉన్నది రాతియుగంలోనా అనే అనుమానం కలుగుతోంది.” అన్నారు. ఊరంతా చూస్తుండగానే మూడుసార్లు ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశారని.. కావాలని చేసినప్పటికీ.. డ్రైవింగ్‌ రాకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని కేసు నమోదు చేస్తారా ? పతనమైన పోలీసు వ్యవస్థకు ఇది పరాకాష్ఠ కాదా ? అని లోకేశ్‌ నిలదీశారు.

➡️