ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కిర్గిజ్స్తాన్లో ఉంటున్న భారతీయ పౌరులు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని భారత విదేశాంగశాఖ మార్గదర్శకాలు జారీ చేసిందని ఎపిఎన్ఆర్టిఎస్ వెల్లడించింది. అత్యవసరమైతే ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం ఏర్పాటుచేసిన హెల్ప్లైన్ నెంబర్ 0555710041ను సంప్రదించాలని ఎపిఎన్ఆర్టిఎస్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తోందని తెలిపింది. విద్యార్థులు వసతి గృహాల్లోనే ఉండాలని, రాయబార కార్యాలయంతో నిత్యం అందుబాటులో ఉండాలని సూచించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశానుసారం ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను అనుసరిస్తూ పరిస్థితిని తెలుసుకుంటున్నామని పేర్కొంది. శనివారం నలుగురు తెలుగు విద్యార్థులు తమ హెల్ప్లైన్ను సంప్రదించారని తెలిపింది. అల్లర్లు జరుగుతున్న ప్రదేశాల నుంచి దేశ, తెలుగు విద్యార్థులందరూ సురక్షిత ప్రదేశాల్లో ఉన్నారని వివరించింది. ఎపికి చెందిన ప్రజలు, విద్యార్థులు 918632340678, 918500027678 తమ హెల్ప్లైన్ నెంబర్లను, ingo@apnrts.com, helpline@apnrts.com మెయిల్స్ ద్వారా సంప్రదించాలని వెల్లడించింది.