రీపోలింగ్ పై నేడు హైకోర్టులో విచారణ

అమరావతి : వైసిపి, టిడిపి నాయకులు వేసిన రీపోలింగ్ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టు విచారణ చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలు జరిగిన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో రీపోలింగ్ నిర్వహించాలని వైసిపి, టిడిపి నాయకులు ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోని 236, 237, 253, 254 పోలింగ్‌ స్టేషన్లలో రీపోలింగ్ నిర్వహించాలంటూ ఏపీ హైకోర్టులో అంబటి రాంబాబు పిటిషన్ దాఖలు చేయగా, చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి  చంద్రగిరి నియోజకవర్గంలోని 4 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ చేపట్టాలని పిటిషన్ వేశారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేయడంతో అక్కడ రీపోలింగ్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం చేస్తున్నారు. తాజాగా దీనిపై ఏపీ సీఈవో ఎంకే మీనా వివరణ ఇవ్వడం జరిగింది. ఈవీఎం ధ్వంసమైనా అందులోని డేటా భద్రంగా ఉందని అన్నారు. మాచర్లలో రీపోలింగ్ నిర్వహించే అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. రిగ్గింగ్‌ జరిగిన చోట రీపోలింగ్ జరపాలని వైసీపీ నేత కాసు మహేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై హైకోర్టులో పిటిషన్‌ వేస్తామన్నారు. అవసరమైన రీపోలింగ్‌ నిర్వహించాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు.

➡️