- తాడిపత్రిలో మాక్ డ్రిల్, ఫ్లాగ్ మార్చ్
ప్రజాశక్తి – అనంతపురం : అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్రెడ్డి సోమవారం తన స్వగ్రామానికి వస్తున్నారని సోషల్ మీడియాలో రూమర్స్ వ్యాపించాయి. అయితే ఆయన హైదరాబాదులోనే ఉన్నట్లు టిడిపి నాయకులు తెలిపారు. సిట్ అధికారులు సోమవారం ఉదయం తాడిపత్రి నుంచి వెళ్లిపోయారు.
ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే అప్రమత్తంగా ఉంటూ నిర్దేశిత సమయంలో ఘటనా స్థలానికి వెళ్లి చర్యలు తీసుకోగలుగుతారో పరీక్షించడానికి పోలీసు అధికారులు తాడిపత్రిలో మాక్ డ్రిల్, ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. తెల్లవారుజామున మూడు గంటలకు అలర్ట్నెస్ను పరీక్షించారు. అనంతపురం రేంజ్ డిఐజి డాక్టర్ షిమోషి, జిల్లా ఎస్పి గౌతమిశాలి ఆదేశాల మేరకు అదనపు ఎస్పిలు ఆర్ విజయభాస్కర్ రెడ్డి, జి.రామకృష్ణ, డిఎస్పిలు బి.శ్రీనివాసులు, జి.శివభాస్కర్ రెడ్డి, బివి శివారెడ్డి, యు.నరసింగప్ప, శ్రావణ్ కుమార్ నేతృత్వంలో కేంద్రసాయుధ బలగాలు, ఎపిఎస్పి, ఎఆర్ సాయుధ పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పట్టణంలోని అశోక్ పిల్లర్ నుంచి బండామసీద్, చిన్న బజార్, కటికవీధి, సుంకులమ్మపాలెం, యల్లనూరు రోడ్డు సర్కిల్, పుట్లూరు రోడ్డు సర్కిల్ మీదుగా అర్బన్ పోలీసు స్టేషన్ వరకు ఈ కవాతు కొనసాగింది.