ప్రజాశక్తి-హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్, భౌతిక, రసాయన శాస్త్ర పాఠ్యపుస్తక రచయిత మరియు ఎడిటర్, జన విజ్ఞాన వేదిక మాజీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ముండ్రా ఆదినారాయణ కన్నుమూశారు. ఆయన ప్రస్తుతం జన విజ్ఞాన వేదిక విద్యా విభాగం రాష్ట్ర కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు. జనగామలో చెకుముకి సైన్స్ సంబరాలలో 9, 10, 11తేదీలలో పాల్గొంటూ ఆదివారం ఉదయం 3.00 గంటలకు శ్వాస ప్రక్రియ ఇబ్బంది రావడంతో భువనగిరి ఆసుపత్రి తరలించిన కొద్ది సేపటికి గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త దిగ్భ్రాంతి కి గురి చేసిందని జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటి తెలిపింది. తుదిశ్వాస వరకు జన విజ్ఞాన వేదిక కార్యక్రమాలలో పాల్గొంటూ వుండటం ఆయన నిబద్ధతకు నిదర్శనమని పేర్కొంది. నిరంతరం పిల్లల్లో సైంటిఫిక్ టెంపర్ పెంచాలని ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఆయన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుని వెళతామని, ఈ సమయంలో వారి మరణం జన విజ్ఞాన వేదికకు తీర్చలేని లోటని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు, జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటి తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.