- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్రెడ్డి
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎక్కడా కలుషిత నీరు, పారిశుధ్యం లోపం కారణంగా డయేరియా, అంటు వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్రెడ్డి ఆదేశించారు. గుంటూరు నగరంలో ప్రబలిన డయేరియా, అనంతరం తీసుకున్న చర్యలపై అధికారులతో సిఎస్ శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న మూడు నెలలు అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో తాగునీటి వనరులను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు డ్రైన్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో వైద్యారోగ్యశాఖ కమిషనరు జె నివాస్, సిడిఎంఎ శ్రీకేష్ బాలాజీ హాజరయ్యారు. గుంటూరు జిల్లా కలెక్టరు వేణుగోపాల్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. రహదారి భద్రతా ఫండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంసచివాలయంలో సిఎస్ జవహర్రెడ్డి అధ్యక్షతన రహదారి భద్రతా ఫండ్ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరిగింది. రహదారి భద్రతకు సంబంధించి తీసుకుంటున్న పలు అజెండా అంశాలపై సిఎస్ సమీక్షించారు. ఈ సమావేశంలో రాష్ట్ర టిఆర్ అండ్ కార్యదర్శి ప్రద్యుమ్న, సిడిఎంఎ శ్రీకేష్ బాలాజీ, రవాణాశాఖ కమిషనరు మణేష్కుమార్, ఐజి హరికృష్ణ పాల్గొనగా, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, కార్యదర్శి సత్యనారాయణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.