రెంటచింతల: పోలింగ్ సమయం దగ్గరపడుతున్న వేళ.. పల్నాడు జిల్లా రెంటచింతలలో వైసిపి వర్గీయులు రెచ్చిపోతున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో దాడులకు తెగబడుతున్నారు. ఆదివారం.. తెదేపా పోలింగ్ ఏజెంట్ల ఇళ్లకు వెళ్లి బెదిరించారు. ఏజెంట్లుగా ఉండొద్దని హెచ్చరించారు. దీంతో టిడిపి నేతలకు ఏజెంట్ సమాచారం ఇవ్వడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వైసిపి నేతల దాడిలో పలువురు టిడిపి కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయపడిన వారిని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.