రుయాలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆకస్మిక తనిఖీలు

ప్రజాశక్తి -తిరుపతి సిటీ : రుయాలో సూపర్‌స్పెషాలిటీ వైద్యం అందించేలా ప్రతిపాదనలు తయారు చేయాలని రుయా వైద్యాధికారులకు రాష్ట్ర వైద్యశాఖ మంత్రి వై సతీష్‌ కుమార్‌ సూచించారు. మొట్టమొదటిసారి మంత్రిగా వేంకటేశ్వర స్వామిని దర్శించకోడానికి ఆదివారం కుటుంబ సమేతంగా ఆయన ఆదివారం విచ్చేశారు. శ్రీవారి దర్శనానంతరం సోమవారం రుయా ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆస్పత్రి లోపల అత్యవసర విభాగ వార్డులో వైద్య చికిత్స కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులను అక్కడ అందుతున్న వైద్యం గురించి, వైద్యుల తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఓపి విభాగానికి వెళ్లి ఓపి చీటీలు పొందే దగ్గర ఏవైనా సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయా? అని ఆరా తీశారు. జనరల్‌ మెడిసిన్‌ విభాగంలో ఇన్‌పేషంట్‌, రోగి సహాయకులతో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందుతోందని, మందులు అందుబాటులో ఉన్నాయని రోగులు చెప్పారు. ఎండాకాలంలో కొద్దిపాటి నీటి సమస్య ఉందని, ప్రయివేట్‌ ఆస్పత్రుల కన్నా మెరుగ్గా వైద్యం అందుతుందని తెలిపారు. రేడియాలజీ డిపార్టుమెంట్‌ను మెరుగుపరచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. వైద్య విద్య ప్రిన్సిపల్‌ డాక్టర్‌ చంద్రశేఖరన్‌, డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుబ్బారావు, వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు, తిరుపతి జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ శ్రీహరిలతో రుయా ఆస్పత్రి అభివృద్ధిపై చర్చించారు. ఈ కార్యక్రమంలో బిజెపి, టిడిపి నాయకులు భానుప్రకాష్‌రెడ్డి, సుగుణమ్మ, నరసింహయాదవ్‌ పాల్గొన్నారు.

➡️