హైదరాబాద్ : నందమూరి తారకరామారావు వర్ధంతి వేడుకలు గురువారం తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ తెల్లవారుఝామునే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ క్రమంలో అప్పటికే ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఉన్న అభిమానులు వారితో ఫోటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. దీంతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద కాస్త రద్దీ ఏర్పడింది. 1996 జనవరి 18న మరణించిన ఎన్టీఆర్ ను స్మరిస్తూ అనేకమంది ఆయన సినీ పాత్రలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో గురువారం గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం టిడిపి కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ మంత్రి, స్వర్గీయ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గం సమన్వయకర్త నందం అబద్దయ్య, నియోజకవర్గం ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.