ఐఎస్బి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అరెస్టుకు వారెంట్ జారీ
ప్రజాశక్తి-హైదరాబాద్ బ్యూరో :తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్రావును అరెస్టు చేసేందుకు నాంపల్లి కోర్టు వారెంట్ జారీ చేసింది. నోటీసులకు స్పందించకపోవడంతో సిఆర్పిసి 73 సెక్షన్ కింద అరెస్టు వారెంట్ జారీ చేయాలని హైదరాబాద్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అందుకు అనుమతిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఫోన్ ట్యానింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత విదేశాలకు పారిపోయిన ప్రభాకర్రావును పట్టుకునేందుకు ఇప్పటికే పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. రెడ్ కార్నర్ నోటీసు, ఇంటర్పోల్ అధికారులను దర్యాప్తు బృందం సంప్రదించాలంటే కోర్టు అనుమతించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సిఆర్పిసి 73 ద్వారా పోలీసులు అరెస్టు వారెంట్ తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు నలుగురు పోలీసు అధికారులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.