ప్రజాశక్తి -మచిలీపట్నం రూరల్ : మచిలీపట్నంలో రాజకీయ దాడులు జరుగుతున్నాయి. మచిలీపట్నంలోని జనసేన నాయకుడు కోరియర్ శ్రీను కు చెందిన బార్ లో కౌంటర్ లో ఉన్న నరహరశెట్టి రాము, దేవరకొండ మధుపై వైసిపి అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరులు దాడి చేశారు. ఈ దాడిలో రాము, మధు లు తీవ్రంగా గాయపడ్డారు. బార్ లో తాగడానికి వచ్చిన ఐదుగురు పేర్ని కిట్టు అనుచరులు… బీర్ సీసాలతో కౌంటర్ లో ఉన్న రాము, మధులపై దాడి చేశారు. రాజకీయపరంగా దాడి జరిగినట్టు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న చిలకలపూడి సీఐ సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడిలో గాయపడినవారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గతంలో పేర్ని నాని అనుచరుడుగా కొరియర్ శ్రీను ఉన్నారు. కొరియర్ శ్రీను జనసేన పార్టీలోకి వచ్చినప్పటి నుండి అనేకసార్లు శ్రీనుని పేర్ని నాని టార్గెట్ చేశారు. గతంలో అనేకసార్లు కొరియర్ శ్రీను ఆఫీస్ పై పేర్ని నాని అనుచరులు దాడి చేశారు.
జనసేన నాయకుడు కొరియర్ శ్రీను మాట్లాడుతూ … గత ఆరు నెలలుగా పేర్ని నాని తనను టార్గెట్ చేస్తున్నాడని ఆరోపించారు. ఆఫీసులపై దాడులు చేయించడం, ఇప్పుడు తన బార్ కి గంజాయి బ్యాచ్ ని పంపి తమవాళ్లపై దాడి చేయించాడని చెప్పారు. పేర్ని నాని రౌడీయిజానికి కొంత మంది పోలీసులు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. తమపై దాడులు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోకపోగా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.