ప్రజాశక్తి-చిలమత్తూరు(బాగేపల్లి) :కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి తాలుకాలోని పాతపల్లి గ్రామం బైరేగొల్లహల్లి సమీపంలో మలుపు వద్ద ఓ ప్రయివేటు బస్సు అదుపుతప్పి గురువారం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. పది మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన మేరకు..కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి తాలూకా చేళూరు నుంచి చాక్వేల్, నారేముద్దేపల్లి, పాతపాళ్యం మీదుగా బాగేపల్లికి ప్రయాణికులతో ఓ ప్రయివేటు బస్సు ప్రతిరోజూ తిరుగుతుంది. చేళూరు నుంచి 45 మంది ప్రయాణికులతో వెళ్తుండగా పాతపాళ్యం సమీపం బైరేగొల్లహల్లి మలుపు వద్దకు రాగానే బస్సు అదుపుతప్పి రోడ్డుకు పక్కన ఉన్న చెట్టును ఢకొీంది. బస్సు బోల్తాపడి పొలాల్లో పడిపోయింది. నారేముద్దపల్లి గ్రామానికి చెందిన అహ్మద్ బాషా(25), రేచనాయకనహల్లి గ్రామానికి చెందిన తలారి వెంకటరాయప్ప(65) అక్కడికక్కకడే మరణించారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 13 మందికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం చిక్బల్లాపుర్, బెంగుళూరు ఆస్పత్రులకు తరలించారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/22-2.jpg)