అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి : ఎఐఎడబ్ల్యుయు అఖిల భారత వ్యవసాయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ లో న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగుల పట్ల జగన్‌ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం నిరంకుశ చర్య అని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ అన్నారు. మంగళవారం నాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. పాదయాత్ర చేస్తున్న సందర్భంలోనూ, ఎన్నికల్లో అధికారంలోకి రాగానే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ జీతాలు ఇస్తామని జగన్‌ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అంగన్‌ వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించడం ప్రజాస్వామ్య హక్కులను అపహాస్యం చేయడమేనని అన్నారు. తక్షణం అంగన్‌వాడీల వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో అంగన్‌ వాడీలపై గాని, ఇతర ఉద్యోగులపై గాని ఎస్మా ప్రయోగించిన ప్రభుత్వాలు ఎన్నికల్లో ఓడిపోయాయని జగన్‌ గమనించాలని వెంకట్‌ తెలిపారు. పండగ రోజులలో ఇళ్లను, కుటుంబాలను వదిలి అంగన్‌ వాడీలు రోడ్లపై ఆందోళన చేస్తున్న పోలీసులతో నిర్బంధించడం శోచనీయమని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వెంకట్‌ డిమాండ్‌ చేశారు.

గ్రామీణ పేదల పోరాటాలను పట్టణాలకు విస్తరిస్తాం

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతూ అనుసరిస్తున్న విధానాలను విశాల ఐక్య ఉద్యమాలతో ప్రతిఘటిస్తామని వెంకట్‌ అన్నారు. మోడీ ప్రభుత్వం గత పదేళ్లుగా కార్పొరేట్‌, మతోన్మాద విధానాలతో దేశాన్ని అస్తవ్యస్తం చేస్తున్నదని అన్నారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పడంతో మరింత సంక్షోభంలో కూరుకుపోయి రైతుల ఆత్మహత్యలు, వ్యవసాయ కార్మికుల ఆకలి చావులు పెరుగుతున్నాయని తెలిపారు. ఎన్‌సిఆర్‌బి లెక్కల ప్రకారం ఒక సంవత్సర కాలంలో లక్షా అరవై వేల మంది పైగా రైతులు, కూలీలు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ప్రభుత్వ గోడౌన్‌లలో మూలుగుతున్న ఆకలితో అలమటించే వారి సంఖ్య పెరగటం, ఆకలి సూచీలో ప్రపంచంలో దేశం 111వ స్థానంలో చేరటం మోడీ విధానాల దుష్ఫలితమేనని అన్నారు. కార్పొరేట్‌ విధానాలను ప్రతిఘటిస్తున్న ప్రజల మధ్య చిచ్చుపెట్టే విధంగా రెచ్చగొట్టే విధంగా కేంద్రం వ్యవహరిస్తున్నదని అన్నారు. ఇప్పటివరకు గ్రామీణ పేదలను కూడగట్టి ఉద్యమాలు సాగిస్తున్న సంయుక్త కిసాన్‌ మోర్చా రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్య సంఘటన రానున్న కాలంలో కార్మిక కర్షక సంఘాలతో పట్టణాలకు విస్తరించి మోడీ దుష్ట విధానాలను ఎదుర్కొంటామని తెలిపారు. ఈ నెల 19న కార్మిక కర్షక మైత్రి దినోత్సవం నిర్వహిస్తున్నామని,26న దేశవ్యాప్తంగా 600 జిల్లాల్లో ట్రాక్టర్‌, ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఫిబ్రవరి 1 నుండి15 వరకు కోట్లాది మందితో సంతకాల సేకరణ, ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా హర్తాల్‌, సభలు, సమావేశాలు జరుపుతామని తెలిపారు.

➡️