- సిఎం రేవంత్రెడ్డిపై హరీశ్రావు ఆగ్రహం
హైదరాబాద్: కష్ణా నదిపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులను నెల రోజుల్లో కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్(కేఆర్ఎంబీ)కి అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఈ అంశంపై సోమవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో జరిగిన కేఆర్ఎంబీ రెండో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కేఆర్ఎంబీ రెండో మీటింగ్ మినట్స్లోనే ఉన్నాయన్నారు. తాము నిలదీశాకే ప్రాజెక్టులపై ఢిల్లీకి లేఖ రాశారన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో కృష్ణాపై ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించలేదని, కేవలం రెండు నెలల పాలనలోనే కాంగ్రెస్ ఆ పని చేసిందని విమర్శించారు. తప్పులను కప్పి పుచ్చుకునేందుకే సర్కారు పెద్దలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఢిల్లీకి ప్రాజెక్టులు అప్పగించి తెలంగాణను అడుక్కునే స్థితికి తీసుకువచ్చారని మండిపడ్డారు. రాజకీయాలు కాదు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగేలా వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేశారు. ఇక నుంచి ప్రాజెక్టులపైకి వెళ్లాలంటే సీఆర్పీఎఫ్ అనుమతి తప్పనిసరన్నారు. ప్రాజెక్టుల అప్పగింత వల్ల ఏపీ లాభం జరుగుతుందని పత్రికలో వచ్చినా సీఎం రేవంత్రెడ్డిపై హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.