ఇచ్చిన హామీలను ఇప్పటికైనా వెంటనే నెరవేర్చాలి : సిపిఎం

ప్రజాశక్తి-విజయవాడ : ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి మెగా డిఎస్సీ ప్రకటిస్తానని ఇచ్చిన హామీలను ఇప్పటికైనా వెంటనే నెరవేర్చాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. డిఎస్‌సి ప్రకటించమని బొత్స సత్యనారాయణ క్యాంప్‌ కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళ్లిన డివైఎఫ్‌ఐ నాయకులు, డిఎస్సీ అభ్యర్ధులపై దురుసుగా వ్యవహరించి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. గడచిన 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది నిరుద్యోగులు డిఎస్సీ కోసం లక్షల రూపాయలు వెచ్చించి కోచింగ్‌లు తీసుకుని ఎదురు చూస్తున్నారని.. కానీ ఇప్పటికీ ప్రభుత్వం డిఎస్సీ ప్రకటించకపోవడంతో రాష్ట్ర వ్యాపితంగా ఆందోళనలు సాగుతున్నాయన్నారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులను అరెస్టులు చేయడం అక్రమమని.. ఇప్పటికైనా వెంటనే డిఎస్సీ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

➡️