- 45 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆదివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా 197 మండలాల్లో వడగాడ్పులు, 45 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. ఈ మేరకు శనివారం రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎమ్డి రోణంకి కూర్మనాథ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 22న 70 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 116 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆదివారం తీవ్ర వడగాడ్పులు వీచే మండలాల్లో శ్రీకాకుళంలో 12, విజయనగరం 22, పార్వతీపురం మన్యం 8, విశాఖపట్నం 1, కాకినాడ 1, అనకాపల్లి, కె కోటపాడు ఒక మండలం ఉంది. వడగాడ్పులు వీచే మండలాల్లో శ్రీకాకుళం 9, విజయనగరం 4, పార్వతీపురం మన్యం 5, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 10, విశాఖపట్నం 3, అనకాపల్లి 17, కాకినాడ 18, కోనసీమ 7, తూర్పుగోదావరి 18, పశ్చిమగోదావరి 3, ఏలూరు 14, కృష్ణా 13, ఎన్టిఆర్ 8, గుంటూరు 16, పల్నాడు 25, బాపట్ల 6, ప్రకాశం 17, నెల్లూరు 1, తిరుపతి 3 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. అలాగే శనివారం ప్రకాశం జిల్లా దరిమడుగులో 44.1, పార్వతీపురం మన్యం జిల్లా నవగాం, తిరుపతి జిల్లా మంగ నెల్లూరులో 43.9, చిత్తూరు జిల్లా నింద్రలో 43.6, నెల్లూరు జిల్లా కసుమూరులో 43.4, విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 43.3, నంద్యాల జిల్లా గోస్పాడు, పల్నాడు జిల్లా రావిపాడులో 43 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.