రాష్ట్ర‌స్థాయి ‘ఆడుదాం ఆంధ్రా’ను ప్రారంభించిన మంత్రి రోజా

Feb 9,2024 14:37 #aadudamu andhra, #rk roja, #Visakha
rk roja on tdp adudam andhra state level games
  • ఈనెల 13న ముగింపు వేడుకలు..
  • హాజరుకానున్న సీఎం జగన్‌
  • ఉత్తమ క్రీడాకారులకు జాతీయ అకాడమీలో శిక్షణ 
  • ఆడుదాం ఆంధ్రా కిట్‌లపై సీఎం ఫోటో వేస్తే తప్పేంటి? : మంత్రి రోజా

ప్రజాశక్తి-విశాఖ : గ్రామీణస్థాయి నుంచి యువతలో క్రీడా నైపుణ్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా ప్రారంభించిన మెగా టోర్నీ ‘ఆడుదాం ఆంధ్రా’ రాష్ట్ర‌స్థాయి పోటీల‌ను శుక్ర‌వారం విశాఖ‌లో మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. నాలుగు దశల్లో నిర్వహించిన క్రికెట్‌, వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్‌ పోటీలకు విశేష స్పందన రాగా.. జిల్లా స్థాయిలో సత్తా చాటిన జట్లతో రాష్ట్ర స్థాయి పోటీలను ఇవాళ్టి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు ఫైన‌ల్ పోటీలు నిర్వ‌హించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ..ఆడుదాం ఆంధ్ర ఫైనల్స్ కి 260 జట్లతో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నరని, ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు మహా సంగ్రామం జరగనుందని,13న ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి జగన్‌ హాజరుకానున్నారని తెలిపారు. ఈ క్రీడల్లో విజేతలకు దాదాపు రూ.12కోట్ల బహుమతులుగా ఇస్తున్నామని పేర్కొన్నారు.

ఇప్పటివరకు రాష్ట్రం నలుమూలల నుండి ప్రతిభావంతులైన యువతీ, యువకులు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖో-ఖో మరియు బ్యాడ్మింటన్ వంటి 5 క్రీడలలో పాల్గొన్నారని,37.75 లక్షల మంది ఆటగాళ్ళు, 85.02 లక్షల మంది ప్రేక్షకులు ఇందులో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్నారని, అంటే 1.2 కోట్ల మందికి పైగా ప్రజలు నేరుగా కార్యక్రమంలో నిమగ్నమయ్యారని ఇదోక అనూహ్యమైన స్పందనగా అభివర్ణించారు. ఆడుదాం ఆంధ్రాలో మహిళా భాగ్యస్వామ్యానికి మంచి ఆదరణ లభించడం విశేషమని,. ఇప్పటివరకు దాదాపు 8 లక్షల మంది మహిళా క్రీడాకారిణులు పాల్గొనడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోందని, అంతే కాకుండా వారి అత్యంత ఇష్టపడే క్రీడల్లో ఖో-ఖో (3,10,756 మంది) కబడ్డీ (1,89,135 మంది మహిళా క్రీడాకారులు) పాల్గొనడం జరిగిందని తెలిపారు.

ఆడుదాం ఆంధ్రా కిట్‌లపై సీఎం జ‌గ‌న్ ఫోటో వేస్తే తప్పేంటి? అని ప్ర‌శ్నించారు. ఆంధ్రా దిష్టిబొమ్మ చంద్రబాబు ఫోటో వేయాలా? అని మంత్రి నిల‌దీశారు. పచ్చ మీడియా కడుపు మంటతో రగిలిపోతోంద‌ని మంత్రి ఆర్కే రోజా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.2024 ఎన్నికల తర్వాత నాన్ లోకల్‌ పొలిటీషియన్‌లు చంద్రబాబు.. పవన్.. లోకేష్.. షర్మిల తెలంగాణా పారిపోవడం ఖాయమని, జగన్‌మోహన్‌రెడ్డి సింహంలా మ్యానిఫెస్టోతో సిద్దంగా వుంటే ప్రతి పక్ష పార్టీలు ఇంకా సిద్దంగా లేరని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో వార్ వన్ సైడ్‌.. మళ్లీ జగన్‌ సీఎం కావడం ఖాయమ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

షర్మిల ఇప్పుడు ఏ పార్టీలో ఉందో ఒక సారి గమనించాలని, వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డిని జైలు పాలు చేసిన పార్టీతో చేతులు కల్పి అన్యాయం చేశారన్నారు. షర్మిలకి సలహా ఇస్తున్నానని, ఇప్పుడు తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి నుంచి మనకి రావాల్సిన 6 వేల కోట్లు అని, ఉమ్మడి ఆంధ్ర హయాంలో ఏపీకి రావాల్సిన లక్ష 80 కోట్ల ఆస్తులు రాబ‌ట్టాలన్నారు. టూర్ లు పెట్టి ప్రచారం చేస్తున్నారని, తెలంగాణలో పోరాటం చేస్తా అని చెప్పి కాంగ్రెస్ లో విలీనం ఎందుకు చేసిందో షర్మిల చెప్పాలని మంత్రి రోజా ప్ర‌శ్నించారు.

ఏపీలో ఏ లబ్ది పొందడానికి కాంగ్రెస్ తరుపున ప్రచారం చేస్తున్నారో షర్మిల చెప్పాలని, వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే కాంగ్రెస్ మీద ఉమ్మేసి వాళ్ళు అని చెప్పి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని కాంగ్రెస్ లో మళ్ళీ జాయిన్ అయ్యారో చెప్పాలని మంత్రి రోజా నిల‌దీశారు. గట్స్‌ ఉన్న నాయకుడు వైయ‌స్ జ‌గ‌న్‌. చంద్రబాబు, లోకేశ్‌, టీడీపీని జాకీలు పెట్టి లేపినా జాకీలు విరిగిపోతున్నాయి. వయసులో చిన్నవాడైన అమిత్ షా కాళ్ల‌ను చంద్ర‌బాబు పట్టుకోవడం సిగ్గుచేటు అన్నారు.  అధికారంలోకి రావాలన్న కాంక్షతో కాంగ్రెస్‌తో ఒకసారి, బీజేపీతో ఇంకోసారి పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పొలిటికల్‌గా రోజు రోజుకు చంద్ర‌బాబు దిగజారిపోతున్నారని ధ్వ‌జ‌మెత్తారు.

➡️