బొలేరోను ఢీకొన్నలారీ

road accident in atp
  • ముగ్గురు మృతి
  • రిసెప్షన్‌కు వెళ్లి వస్తుండగా ఘటన

ప్రజాశక్తి-అగళి (సత్యసాయి జిల్లా) : వివాహ రిసెప్షన్‌ ముగించుకుని సంతోషంగా ఇంటి వస్తున్న వారిని మృత్యువు రూపంలో లారీ కబళించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా..ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా అగళి మండలం ఇరిగేపల్లి రహదారిపై ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం పలు కుటుంబాల్లో చీకటిని నింపింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు.. సత్యసాయి జిల్లా రొళ్ల మండలం దాసప్పపాళ్యంకు చెందిన మద్దరంగప్ప కూతురు వివాహ రిసెప్షన్‌ కర్ణాటక రాష్ట్రం శిరా పట్టణం హుజ్జహీరనహల్లి గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు మద్దరంగప్ప బంధువులు 14 మంది బొలేరో వాహనంలో వెళ్లారు. వేడుక అనంతరం తిరుగు పయనమయ్యారు. అర్ధరాత్రి 11.45 గంటలకు శిరా నుంచి రొళ్ల వైపునకు వస్తుండగా హిందూపురం నుంచి శిరా వైపు వెళ్తున్న సిమెంట్‌ లారీ వేగంగా వచ్చి బొలేరో వాహనాన్ని ఢీకొంది. దీంతో బొలేరో వాహనం పల్టీలు కొట్టడంతో నిషిరాత్రిలో ఒక్కసారిగా హహాకారాలు మిన్నంటాయి. ఈ ప్రమాదంలో బొలేరోలో ఉన్న దాసప్పపాళ్యం గ్రామానికి చెందిన కాంతప్ప (40), అమ్మజక్క (35), తిమ్మప్ప (43) అక్కడికక్కడే మరణించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన ఆరుగురిని చికిత్స నిమిత్తం హిందూపురం, తుముకూరు, మడకశిర ఆస్పత్రులకు తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతివేగమే ప్రమాదానికి కారణం అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️