222 మండలాల్లో వడగాల్పులు
విపత్తుల నిర్వహణ సంస్ధ
ప్రజాశక్తి- అమరావతి బ్యూరో :రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం 66మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 222 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈనెల 8న 22మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎమ్డి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఆదివారం తీవ్ర వడగాల్పులు శ్రీకాకుళం జిల్లాలో 15మండలాలు, విజయనగరంలో 24, పార్వతీపురం మన్యంలో 11, విశాఖలో 1, అనకాపల్లిలో 7, కాకినాడలో 4, తూర్పుగోదావరిలో 2 మండలాల్లో వీచే అవకాశం ఉందని తెలిపారు. శనివారం అనకాపల్లి జిల్లా రావికమతం, నంద్యాల జిల్లా బ్రాహ్మణ కొట్కూరు, పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ, లేవిడి, ప్రకాశం జిల్లా తోకపల్లి, వైఎస్ఆర్ జిల్లా బలపనూరులో 44.6 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలు జిల్లా గూడూరులో 44.6, విజయనగరం రాజాంలో 44.4, డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 127 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 231 మండలాల్లో వడగాల్పులు వీచాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎమ్డి తెలిపారు.