ప్రజాశక్తి – నకరికల్లు (పల్నాడు జిల్లా) : ఇద్దరు బాలికలపై లైంగికదాడి జరిగిన సంఘటన పల్నాడు జిల్లా నకరికల్లు మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. సత్తెనపల్లి డిఎస్పి గురునాథబాబు వివరాల మేరకు.. ఉదయనగర్ తండాకు చెందిన బొజ్జ నాగమల్లేశ్వరరావు స్థానికంగా కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. పాఠశాలలకు వేసవి సెలవుల నేపథ్యంలో ఇంటి వద్ద ఆడుకుంటున్న ఓ బాలికకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పది రోజుల అనంతరం మరో బాలికపైనా అదే విధమైన చర్యకు పాల్పడ్డాడు. బాలికల ప్రవర్తనలో తేడాలను గమనించిన తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. దీంతో బాధిత కుటుంబీకులు నకరికల్లు పోలీస్స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టినట్లు డిఎస్పి చెప్పారు.