మారణాయుధాలతో పట్టుబడ్డవారిపై చర్యలు శూన్యం
టిడిపి రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు
ప్రజాశక్తి-మంగళగిరి : వైకాపా దొంగ ఓట్లపై పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పోరాటం చేస్తున్నారనే ఆయనను అక్రమ కేసులతో వేధిస్తున్నారని టిడిపి రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు విమర్శించారు. మార్టూరులో పట్టపగలు అధికారులే మారణాయుధాలతో తనిఖీలు చేయడం జగన్ గూండారాజ్కు నిలువెత్తు నిదర్శనమన్నారు. అధికారులే అధికార పార్టీ గూండాలుగా మారి రాడ్లు, కర్రలు, కారప్పొడులతో తిరగడం దేనికి సంకేతమని నిలదీశారు. ఆకాశనంటిన అసంతృప్తితో జగన్ కి మతిభ్రమించి ప్రతిపక్షనేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. అసమర్ధుడి పాలనలో న్యాయంపై పోరాటం చేసేవాళ్లందరిని నేరస్తులుగా ముద్రవేయాలని కుట్రపన్నారని తెలిపారు. పెత్తందార్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే కేసులు పెడుతారా? ఏలూరు సాంబశివరావుపై కేసులు పట్టడమంటే అది ప్రజలపై కేసులు పెట్టడమేనని అన్నారు. ఏలూరిని రాజకీయంగా ఎదుర్కోలేకే వైసీపీ ప్రభుత్వం ఆయనపై బురదజల్లే కుట్రలకు తెరలేపిందన్నారు. పదిహేనేళ్ల క్రితం ఏలూరి నోవా అగ్రి గ్రూప్ సంస్థను స్థాపించి రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఆయన సంస్థ నుంచి బయటకు వచ్చారని పేర్కొన్నారు. ఎన్ని రాజకీయాలు చేసినా పర్చూరు నియోజకవర్గంలో ఏలూరి సాంబశివరావు గెలుపుని ఎవరు ఆపలేరని స్పష్టం చేశారు. చంద్రన్న నేతృత్వంలో డెబ్బై రోజుల్లో కళంకిత అధికారులకు, జగన్ మూకలకు తోకలు కత్తిరించే అంబేడ్కర్ రాజ్యం రాబోతోందని గుర్తించుకుంటే మంచిదని హెచ్చరించారు.