పెదకూరపాడు (గుంటూరు) : పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మంటల్లో దగ్ధమైన ఘటన ఆదివారం అర్థరాత్రి జరిగింది. నిన్న అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు టిడిపి కార్యాలయానికి నిప్పు పెట్టినట్లు సమాచారం. పదిరోజుల కిందట కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ నాలుగురోడ్ల కూడలిలోని మన్నెం భూషయ్య కాంప్లెక్స్లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. సభలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి వీలుగా తాటాకులతో చలువ పందిరి ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు పందిరికి నిప్పంటించడంతో కార్యాలయమంతా మంటల్లో బూడిదయ్యింది. ఈ విషయం తెలిసిన వెంటనే టిడిపి, జనసేన నాయకులు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. చంద్రబాబు ప్రజాగళం జరిగిన మరుసటి రోజే ఈ ఘటన జరిగింది. ప్రజాగళం సభ విజయవంతం కావడంతో ఓర్వలేక నిప్పు పెట్టారని, ఇది వైసిపి నాయకుల పనేనని టిడిపి కార్యకర్తలంతా ఘటనా స్థలం వద్ద నిరసన చేశారు. సమీపంలోనే అగ్నిమాపక కేంద్రం ఉన్నా మంటలార్పడానికి ఆలస్యంగా వచ్చారని, కార్యకర్తలు వాహనాన్ని అడ్డుకున్నారు. భాష్యం ప్రవీణ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
![క్రోసూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు వేసిన చలువ పందిరి రాత్రి పదకొండు గంటల తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో పందిరి దగ్ధమైనట్టు పార్టీ కార్యకర్తలు తెలుపుతున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది](https://prajasakti.com/wp-content/uploads/2024/04/tdp-office.jpg)