ప్రజాశక్తి-అమరావతి : ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన ‘చలో అసెంబ్లీ’ ఉద్రిక్తంగా మారింది. పోలీసులను తప్పించుకుని అసెంబ్లీ పరిసరాలకు వచ్చిన సర్పంచులు ప్రభుత్వానికి వ్యవతిరేకంగా నినాదాలు చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. సర్పంచ్లు అసెంబ్లీ సమీపంలోకి వచ్చేయడంతో కంగుతున్న పోలీసులు బారికేడ్లను అడ్డుపెట్టారు. ఈ క్రమంలో బారికేడ్లను తోసుకుని లోపలకెళ్లే ప్రయత్నం చేశారు సర్పంచులు. దీంతో పోలీసులకు, సర్పంచులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. లాఠీలతో కొడుతూ ఈడ్చుకెళ్లి బస్సుల్లో పడేశారు. ఈ ఘటనలో పలువురు సర్పంచులకు తీవ్ర గాయాలయ్యాయి. అంతకుముందు పోలీసులు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. సర్పంచుల చలో అసెంబ్లీకి వెళ్లకుండా పంచాయతీ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ను ఉయ్యురులో పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రతినిధులను మందడంలో అరెస్ట్ చేసి తుళ్లూరు పోలీస్ స్టేషన్కు తరలించారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/02/sarpamnchs.jpg)