హైదరాబాద్ : రేపు రంజాన్ను పురస్కరించుకొని … భాగ్యనగరంలో ముస్లింలు నమాజులకు సన్నద్ధమవుతున్నారు. హైదరాబాద్ రోడ్లన్నీ ముస్లింలతో సందడిని సంతరించుకుంటాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా పోలీసులు ముందస్తుగా ట్రాఫిక్ నిబంధనలు, మళ్లింపులు చేపట్టారు.
మీరాలంమండి ఈద్గా, మాసబ్ట్యాంక్ హాకీ గ్రౌండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం రంజాన్ పండుగ ప్రత్యేక నమాజు దఅష్ట్యా ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని తెలిపారు. పురానాపూల్, కామాటిపురా, కిషన్బాగ్ వైపు నుంచి ఈద్గా వైపునకు వచ్చే వాహనాలను బహదూర్పురా క్రాస్రోడ్స్ దాటి అనుమతించరు. ప్రార్థనలకు వచ్చే వారి వాహనాలను జూపార్క్ ఓపెన్ ప్లేస్లో పార్కింగ్ చేసుకోవాలి. శివరాంపల్లి, దానమ్మహట్స్ వైపునకు వచ్చే వాహనాలను దానమ్మహట్స్ క్రాస్రోడ్స్ వైపు నుంచి ముందుకు వెళ్లనివ్వరు. వీరికి మోడరన్ సా మిల్, మీరాలం ఫిల్టర్ బెడ్, సూఫీ కార్స్ వద్ద పార్కింగ్ స్థలం కేటాయించారు. కాలాపత్తర్ వైపు నుంచి వచ్చే వాహనాలను మోచీ కాలనీ, బహదూర్పురా, శంషీర్గంజ్, నవాబ్ సాహెబ్కుంట వైపునకు పంపుతారు. ప్రార్థనలకు వచ్చే వారికి భయ్యా పార్కింగ్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో స్థలం కేటాయించారు. పురానాపూల్ నుంచి బహదూర్పురా వైపునకు వెళ్లే బస్సులను జియాగూడ వైపునకు మళ్లిస్తారు. మాసబ్ట్యాంక్ హాకీ గ్రౌండ్లో ప్రార్థనలు జరగనున్న సందర్భంగా ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు మాసబ్ట్యాంక్ ఫ్లై ఓవర్ కింద నుంచి వాహనాలను అనుమతించరు. వాహనాలు ఫ్లైఓవర్ పైనుంచి వెళ్లడానికి మాత్రమే అనుమతి ఉంటుంది.