ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్ : గ్రామపంచాయతీల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను జగన్ ప్రభుత్వం దారి మళ్ళించడంతో ఉత్సవ విగ్రహాల్లా సర్పంచులు మిగిలిపోవాల్సి వస్తుందంటూ … గ్రామ సర్పంచులు మంగళవారం చిత్తూరు అర్బన్లోని స్థానిక కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు కోక ప్రకాష్ మాట్లాడుతూ … రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల హక్కులను హరిస్తోందన్నారు. గ్రామాల్లో చిన్నచిన్న మరమ్మతుల కోసం కూడా నిధులు లేకుండా అల్లాడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. అంటువ్యాధులు ప్రబలకుండా ఓవర్ హెడ్ ట్యాంకుల శుభ్రత, బ్లీచింగ్ చల్లే పరిస్థితి కూడా లేదని తెలిపారు. సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి సర్పంచుల హక్కులను పూర్తిగా హరించారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని సర్పంచులు హెచ్చరించారు.