ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :ఐక్య పోరాటాలతో స్టీల్ప్లాంట్ను కాపాడుకుంటామని హెచ్ఎంఎస్ స్టీల్ప్లాంట్ విభాగం నాయకులు దొమ్మేటి అప్పారావు, గణపతి రెడ్డి స్పష్టం చేశారు. స్టీల్ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 1144వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో హెచ్ఎంఎస్ యూనియన్ కార్యకర్తలు, కాంట్రాక్టు కార్మికులు కూర్చున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును ప్రజలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. ఉక్కు కాంట్రాక్టు, శాశ్వత కార్మికులు పోరాటాన్ని ఉధృతం చేసి ప్లాంట్ను రక్షించుకోవడం ద్వారా నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. ప్రజల ఆకాంక్షను గుర్తెరిగి ఇప్పటికైనా ప్లాంట్ ప్రయివేటీకరణ ప్రయత్నాలను కేంద్రం విరమించుకోవాలన్నారు. సొంత గనులు కేటాయించి, పూర్తి సామర్థ్యంతో కర్మాగారాన్ని నడపాలని డిమాండ్ చేశారు.