ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పెన్షన్దారుల కష్టాలకు చంద్రబాబే బాధ్యత వహించాలని మాజీ మంత్రి రావెల కిశోర్బాబు అన్నారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంటివద్దకు అందే పెన్షన్లను చంద్రబాబు తన మనుషుల ద్వారా అడ్డుకోవడంతో బ్యాంకుల వద్ద వృద్ధులు పెన్షన్ తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పెన్షన్ల పంపిణీని అడ్డుకున్న చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో గుణపాఠం తప్పదని రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ విమర్శించారు. పండుటాకుల మీద టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రతాపం చూపిందని వైసిపి అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ అన్నారు.
ఇసికి ఫిర్యాదు
ఎన్నికల నిబంధనావళిని చంద్రబాబు, పవన్కల్యాణ్ ఉల్లంఘించారని ఎమ్మెల్యే మల్యాది విష్ణు అన్నారు. ఈ మేరకు సిఇఒ ఎంకె మీనాకు వైసిపి రాష్ట్ర నాయకులు అంకంరెడ్డి నారాయణమూర్తితో కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ… ఈ నెల 2న చంద్రబాబు రాయచోటిలో, పవన్కల్యాణ్ విశాఖపట్నం దక్షిణ, పాలకొండ ఎన్నికల సభల్లో సిఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని అన్నారు.