విశాఖ: మునిగిపోతున్న నావలాంటి వైసిపి నుంచి సురక్షితంగా బయటపడేందుకు అనేక మంది ప్రయత్నిస్తున్నారని టిడిపి నేత గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గని మాట్లాడారు. ”ఎంపీలకు కూడా జగన్ కలిసే అవకాశం ఇవ్వడం లేదు. ఆయన్ను రెండుసార్లే కలిసినట్లు కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ చెప్పారు. పెనమలూరు సీనియర్ ఎమ్మెల్యే ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. అంబటి రాయుడు ఏవేవో ఊహించుకొని వైసిపిలోకి వెళ్లి.. పరుగులు చేయకుండానే బయటకు వచ్చేశారు. ఇప్పుడేమో జనసేన వైపు చూస్తున్నారు. ఎమ్మెల్యేల బదిలీలు ఇంత పెద్దఎత్తున ఎప్పుడూ చూడలేదు. 50 శాతం ఎమ్మెల్యేలు వైసిపిను వీడే పరిస్థితి వచ్చింది. ఈ నెల 20న భీమిలి నుంచి జగన్ ప్రజాయాత్రలు ప్రారంభిస్తారట. ఆయనకు ప్రజల నుంచి ఛీత్కారాలు తప్పవు. ఉమ్మడి విశాఖలో ఒక్క స్థానంలోనూ వైసిపి గెలిచే అవకాశమే లేదు” అని గంటా శ్రీనివాసరావు చెప్పారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/01/7-15.jpg)