తిరుపతి సిటీ : జనసేన నాయకుడు రుద్ర కిషోర్ ఇంటిపై వైసిపి నాయకులు ఆదివారం రాత్రి దాడి చేశారు. ఇంటి గేట్లను పడగొట్టి ఆయన కుటుంబ సభ్యులపై దాడికి యత్నించారు. 12వ డివిజన్ పరిధిలోని డిఆర్ మహల్ వెనుక వైపు ఉన్న వెంకటరెడ్డి నగర్ లో జనసేన నాయకుడు రుద్రకిషోర్ నివాసం ఉంటున్నారు. ఇదే ప్రాంతానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జానీ అతని అనుచరులు నిన్న రాత్రి మద్యం తాగి రుద్ర కిషోర్ ఇంటిపై దాడికి దిగారు. ఇంటి గేటును పగలగొట్టి రుద్ర కిషోర్ కుటుంబ సభ్యులపై దాడికి యత్నించారు. బలిజ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశంలో ఉన్న జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రుద్ర కిషోర్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు విషయం తెలుసుకుని ఘటనాస్థలానికి చేరుకోగా సీఐ మహేశ్వర్ రెడ్డితో ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ .. జనసేన నాయకుడు రుద్ర కిషోర్ ఇంటిపై దాడి చేసిన వైసిపి నేతలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.