ప్రజాశక్తి – కడప అర్బన్ : పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల పర్యటనను అడ్డుకుంటామని తెలంగాణ రాష్ట్రానికి చెందిన వైఎస్ రాజశేఖర్రెడ్డి అభిమాని కొండా రాఘవరెడ్డి అన్నారు. కడప ప్రెస్క్లబ్లో గురువారం ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ కుటుంబానికి ఎంతో మంది అభిమానులు ఉన్నారని చెప్పారు. ఆ కుటుంబాన్ని విడదీయడానికి ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తరుపున ఎన్నికల్లో వైఎస్ షర్మిల పోటీ చేయడం దారుణమన్నారు. తెలంగాణ బిడ్డను, బతుకమ్మ బిడ్డను అన్న షర్మిల తెలంగాణలో పార్టీని మూసివేసి, వేల కుటుంబాలకు అన్యాయం చేశారని తెలిపారు. ఇప్పుడు ఎపిని మోసం చేయడానికి వచ్చారని విమర్శించారు. వివేకానందరెడ్డి ఎవరి ప్రభుత్వంలో చనిపోయారో షర్మిలకు తెలియదా? అని ప్రశ్నించారు. సిఎం జగన్మోహన్రెడ్డి వద్దకు రూ.వెయ్యి కోట్ల పని కోసం షర్మిల, అనిల్కుమార్ ఫైల్ తీసుకుని వచ్చారని, అంగీకరించకపోవడంతో అక్కసు పెంచుకున్నారన్నారు. షర్మిలకు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు తెలంగాణ నుంచి వేలాది మంది వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/04/ragava-reddy.jpg)