న్యూఢిల్లీ : ఓ మహిళ లగ్జరీ హోటల్లో 15 రోజులు ఎంజాయ్ చేసింది. రూ.6 లక్షల బిల్లు చేసింది. డూప్లికేట్ యాప్ తో హోటల్ సిబ్బందిని బురిడీ కొట్టించబోయి.. కటకటాలపాలయ్యింది.. ఇంతకీ ఆ మహిళ అకౌంట్లో ఎంత డబ్బుందనుకున్నారూ..? రూ.41..!
పూర్తి వివరాల్లోకెళితే … ఎపికి చెందిన ఝాన్సీరాణి అనే మహిళ ఢిల్లీలోని ఏరోసిటీలో ఉన్న విలాసవంతమైన పుల్మాన్ హౌటల్కు వెళ్లింది. ఇషా దేవ్ అనే నకిలీ పేరుతో హౌటల్ గదిని బుక్ చేసుకొని.. 15 రోజులు అందులోనే లగ్జరీగా గడిపింది. వసతులన్నీ ఎంజాయ్ చేసింది. చివరకు మొత్తం రూ. 5.88 లక్షలు బిల్లు అయ్యింది. ఆమె హౌటల్ను విడిచివెళ్లే టైంలో ఓ యూపీఐ యాప్ ద్వారా డబ్బులు పేమెంట్ చేసినట్టు సిబ్బందికి చూపించింది. అయితే బ్యాంకు అకౌంట్లో మాత్రం డబ్బులు పడలేదు. దీంతో హౌటల్ నిర్వాహకులు దీనిపై పోలీసులకు సమాచారం అందించారు. ఆమెను పోలీసులు జనవరి 13న అరెస్టు చేసి ప్రశ్నించగా.. ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.
అకౌంట్ నకిలీది..!
నిందితురాలు ఝాన్సీరాణి ఉపయోగించిన అకౌంట్ నకిలీదని వెల్లడైంది. మొత్తం రూ.5.88 లక్షల బిల్లులో.. రూ.2.11 లక్షలు ఆమె హౌటల్లోని స్పా సౌకర్యాన్ని వాడుకునేందుకు అయిన ఛార్జీయే కావడం గమనార్హం. హౌటల్ రూంను బుక్ చేసుకునేటప్పుడు తనను తాను ఇషా దేవ్ అనే పేరుతో ఝాన్సీరాణి పరిచయం చేసుకుంది. దీనికి సంబంధించిన ఒక నకిలీ ఐడెంటిటీ కార్డును చూపించింది. ఈ కేసులో ఆమెపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణలో సదరు మహిళ బ్యాంకు ఖాతాలు ఇవ్వడంలో సహకరించలేదు.
అకౌంట్లో ఉంది రూ.41లే..!
ఢిల్లీ పోలీసులు ఝాన్సీరాణి పూర్తి వివరాల కోసం ఎపి పోలీసులను ఆశ్రయించారు. తాను, తన భర్త డాక్టర్లమని.. అమెరికాలోని న్యూయార్క్లో ఉంటామని విచారణలో ఝాన్సీరాణి చెప్పినట్లు పోలీసులు అంటున్నారు. విమానాశ్రయం సమీపంలో మహిళ అన్నిరోజులు ఎందుకు ఉండాల్సి వచ్చిందో విచారణ చేస్తున్నామన్నారు. విశేషమేమిటంటే …. ఆమె బ్యాంకు అకౌంట్లో రూ.41 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అకౌంట్లో డబ్బులు లేకపోయినా… రూ.6 లక్షల బిల్లు చేసింది ఈ మహిళ..!
ఢిల్లీ పోలీసు అధికారి మాట్లాడుతూ … ఆమె తాను ఒక డాక్టర్ నని, తన భర్త కూడా వైద్యుడే అని చెబుతోందన్నారు. తన భర్త న్యూయార్క్లో ఉంటున్నారని చెప్పిందని, అయితే ఈ విషయాన్ని నిర్ధారించుకోవాల్సి ఉందని వివరించారు. హౌటల్ సిబ్బంది ఫిర్యాదు మేరకు ఝాన్సీని జనవరి 13న అరెస్టు చేశామని తెలిపారు. ఐపీపీ సెక్షన్లు 419 (మోసం), 468 (ఫోర్జరీ), 471 (నకిలీ పత్రాల్ని ఉపయోగించడం) కింద కేసు నమోదు చేసినట్టు వివరించారు.