ఏలూరులో జిల్లా నాయకుల హౌస్ అరెస్టులకు సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండన
ప్రజాశక్తి-విజయవాడ : ఈరోజు దెందులూరులో వైఎస్సార్సిపి ‘‘సిద్దం’’ సభకు ముఖ్యమంత్రి హాజరవుతున్న సందర్భంగా ఏలూరులో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి ని హౌస్ అరెస్టు చేయడం దుర్మార్గమని సిపిఎం రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈ అరెస్టులను రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. రవితో పాటు మరికొందరు సిఐటియు కార్మిక నాయకులను కూడా దిగ్భందించారని పేర్కొన్నారు. దీనికి కారకులైన పోలీసు అధికారులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్నిపార్టీలకు రాజ్యాంగ రీత్యా సమానమైన అవకాశాలున్నాయని తెలిపారు. కానీ ఒకపార్టీ సభ పెట్టుకుంటే మరొక పార్టీ నాయకులను అరెస్టు చేయడమంటే అది నిరంకుశ రాజ్యం అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలు రానున్న తరుణంలో ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను అరికట్టేందుకు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు.
![cpm state committee on eluru cpm leaders house arrest](https://prajasakti.com/wp-content/uploads/2024/02/cpm-state-committee-on-eluru-cpm-leaders-house-arrest.jpg)