ప్రజాశక్తి-విజయనగరం కోట : జిల్లాలో హెచ్ఐవి ఉన్న గర్బిణులు, బాలింతలకు కుటుంబ నియంత్రణపై సాధీ ఎన్జిఒ సహకారంతో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యాన శుక్రవారం సర్వజన ఆస్పత్రిలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా క్షయ, ఎయిడ్స్ నివారణ అధికారి కె.రాణి మాట్లాడుతూ మహిళలు మానసికంగా ధృడంగా ఉండాలన్నారు. కాన్పుకు,కాన్పుకు దూరం ఉండాలని, కుటుంబ నియంత్రణ పద్దతులు పాటించాలని తెలిపారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనీల సునందని మాట్లాడుతూ హెచ్ఐవి గర్భిణులు ఆరోగ్యం కాపాడుకుంటూ పిల్లలను కనాలని, వారిని జాగ్రత్తగా చూసుకోవాలని, కుటుంబ నియంత్రణ చేయించుకోవాలని వివరించారు. ఎఆర్టి వైద్యాధికారి డాక్టర్ వరలక్ష్మి మాట్లాడుతూ హెచ్ఐవి ఉన్న గర్బిణులు క్రమం తప్పకుండా ఎ.ఆర్.టి మందులు వాడాలని, రక్త పరీక్షలు చేయించుకోవాలని కోరారు. విఎన్పి ప్లస్ అధ్యక్షులు జికె చౌదరి మాట్లాడుతూ హెచ్ఐవి ఉన్న గర్బిణులకు ప్రభుత్వ ఆసుపత్రులలో కుటుంబ నియంత్రణ సేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సూపర్వైజరు ఎన్. సాక్షి గోపాలరావు, సాధీ ఎన్జిఒ పిఒ డివి సత్యనారాయణ, డిఎస్ఆర్సి, ఎఆర్టి సిబ్బంది పాల్గొన్నారు.