ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎపి జెఎసి పిలుపులో భాగంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు మంగళవారం కలెక్టరేట్ వద్ద పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. తొలుత జెడ్పి కార్యాలయం నుంచి ఎత్తు బ్రిడ్జి, ఆర్అండ్బి జంక్షన్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జెఎసి రాష్ట్ర ఉపాధ్యక్షులు డివి రమణ, కార్యదర్శి సురేష్, పెద్దింటి అప్పారావు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా, రావాల్సిన బకాయిలు చెల్లించకుండా తీవ్రఅన్యాయం చేసిందన్నారు. ఉద్యోగుల పక్షపాతి అని చెప్పుకుంటూ ఉద్యోగులకు ఉపయోగకరమైన చర్యలు చేపట్టడం లేదన్నారు. దాచుకున్న డబ్బు ఎపి జిఎల్ఐ, జిపిఫ్, గ్రాట్యుటీ వంటి డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వం ఉద్యోగులకు అన్యాయం చేస్తుందన్నారు. తక్షణమే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.