టిడిపి నాయకులతో మాట్లాడుతున్న యుటిఎఫ్ నాయకులు
ప్రజాశక్తి-ఉరవకొండ
రాబోయే ఎన్నికల్లో టిడిపి ప్రకటించబోయే మేనిఫెస్టోలో పాతపెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామనే హామీని చేర్చేందుకు రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి తీసుకురావాలని యుటిఎఫ్ నాయకులు కోరారు. ఈమేరకు ఆదివారం పట్టణంలోని టిడిపి కార్యాలయంలో యుటిఎఫ్ ఉరవకొండ జోన్ నాయకులు టిడిపి నాయకులను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ నాయకులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో టిడిపి ప్రకటించబోయే మేనిఫెస్టోలో ఒపిఎస్ విధానాన్ని పునరుద్ధరిస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం చేసే విధంగా అధినాయకత్వానికి తెలియజేయాలని కోరారు. ఏ రాజకీయ పార్టీ అయితే పాతపెన్షన్ పునరుద్ధరిస్తామని హామీ ఇస్తుందో వారికే రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ మద్దతు పలుకుతారని సూచించారు. ఇందుకు టిడిపి ఉరవకొండ, వజ్రకరూరు మండల కార్యదర్శు రామాంజనేయులు, వెంకటేసు స్పందిస్తూ ఉద్యోగుల న్యాయబద్ధమైన సమస్యల పరిష్కారం కోసం టిడిపి ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఇప్పుడు కూడా పాత పెన్షన్ పునరుద్ధరణకు చర్యలు తీసుకునే విధంగా రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా సహాధ్యక్షులు రామప్పచౌదరి, జిల్లా కార్యదర్శి శేఖర్, మండల నాయకులు శ్రీనివాసులు, ఉమాపతి, రఘు, జయరాములు, లక్ష్మీనారాయణ, కోశాధికారి వేణుగోపాల్, మండల కార్యదర్శి మోహన్, పూల బాషా తదితరులు పాల్గొన్నారు.