సత్తెనపల్లిలో బస్సులు కోసం పడిగాపులు పడుతున్న ప్రయాణికులు
ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్ : ఆర్టీసీ బస్సుల్లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బాపట్ల జిల్లా మేదరమెట్లలో జరిగిన వైసిపి ‘సిద్ధం’ సభకు ఆర్టీసీ బస్సులను తరలించడంతో సాధారణ ప్రయాణికులకు అవస్థలు వచ్చిపడ్డాయి. సభకు పల్నాడు జిల్లా నుండి 300 బస్సులు వెళ్లటంతో సుదూర ప్రాంతాలకు బయలుదేరిన ప్రయాణికులకు బస్సులు దొరక్క అగచాట్లు పడ్డారు. జిల్లాలో సత్తెనపల్లి పిడుగురాళ్ల, మాచర్ల, చిలకలూరిపేట వినుకొండ, నర్సరావుపేట ఆర్టీసీ డిపోల పరిధిలో అద్దె బస్సులు కలిసి 430 ఆర్టీసీ బస్సులుండగా వీటిల్లో 300పైగా బస్సులను సిద్ధం సభకు తీసుకెళ్లారు. సత్తెనపల్లి డిపోలో 36 ఆర్టీసీ బస్సులు 15 అద్దె బస్సులు ఉండగా 36 ఆర్టీసీ బస్సులు 6 అద్దె బస్సులు సిద్ధం సభకు వెళ్ళాయి. దీంతో వివిధ అవసరాల కోసం బయలుదేరిన ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం నిరీక్షించాల్సి వచ్చింది. కొంతమంది ప్రయాణాలను మానుకోగా మరికొంతమంది ప్రైవేటు వాహనాల్లో అధిక ఛార్జీలు చెల్లించి రాకపోకలు సాగించాల్సి రావడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు.