ఉల్లి రైతులకు కేంద్రం గుడ్‌ న్యూస్‌..

May 4,2024 15:07 #Business

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ ఉల్లి రైతులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. గతంలో ఉల్లి ఎగుమతులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. అలాగే ఉల్లి ఎగుమతి ధరను టన్నుకు రూ. 45, 860 గా నిర్ణయించింది. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ఎక్సేంజ్‌ విడుదల చేసిన ఓ నోటిఫికేషన్‌లో ఉత్తి ఎగుమతి ధర 500 డాలర్లుగా పేర్కొనడం జరిగింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉల్లి రైతులకు మేలు జరగనుంది. ఇక విదేశాలకు ఉల్లి ఎగుమతిపై పూర్తి నిషేధం విధించిన కేంద్ర సర్కార్‌.. శ్రీలంక, యూఏఈ, బంగ్లాదేశ్‌ వంటి దేశాలకు మాత్రం పరిమితులతో కూడిన ఎగుమతులకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో ఉల్లి ఎగుమతిపై నిషేధాన్ని పూర్తిగా ఎత్తివేయాలని ఉల్లి రైతులు, వ్యాపారులు డిమాండ్‌ చేశారు. ముఖ్యంగా మహారాష్ట్ర ఉల్లి రైతులు ఈ డిమాండ్‌ను గట్టిగా వినిపించారు. అయితే, దేశంలో ఉల్లి ధరలు పెరుగుతాయనే కారణంతో ప్రభుత్వం నిషేధాన్ని అలాగే కొనసాగించింది. ఇప్పుడు పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల రైతులు, వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

➡️