ముంబయి : బ్యాంకు ఖాతాదారుల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లకు సంబంధించి ప్రత్యేక డ్రైవ్లను చేపట్టాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) విత్త సంస్థలకు సూచించింది. ఇందుకోసం మరిన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆర్బిఐ నోటిఫికేషన్ ప్రకారం బ్యాంకులు వినియోగంలో లేని ఖాతాలు, అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లకు సంబంధించి లేఖలు, ఇ-మెయిల్ లేదా ఎస్ఎంఎస్ పంపడం ద్వారా ఖాతాదారులను సంప్రదించాలి. ఈ మెయిల్/ఎస్ఎంఎస్లను మూడు నెలలకు ఒకసారి పంపాలి. అవసరమైతే ఖాతాదారును కనుగొనేందుకు ఇంట్రడ్యూసర్ను, నామినీని కూడా సంప్రదించాలి. సదరు ఖాతాదారుల ఆచూకీ తెలుసుకునేందుకు తరచూ క్యాంపెయిన్లు చేయాలని తెలిపింది. బ్యాంకింగ్ వ్యవస్థలో అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లను తగ్గించేందుకు, ఆ నిధులను వాటి అసలు యజమానులకు తిరిగి అందించేందుకు ఇప్పటికే బ్యాంకులు, రిజర్వ్ బ్యాంకు తీసుకుంటున్న చర్యలకు ఈ మార్గదర్శకాలు అదనపు మద్దతు ఇవ్వనున్నాయి.