- విభజించిన సంస్థలకు ఆస్తుల నిష్పత్తి ఆధారంగా..
న్యూఢిల్లీ : వేదాంత గ్రూపు విభజించిన సంస్థలకు ఆస్తుల నిష్పత్తి ప్రకారం రుణాల కేటాయింపులు చేస్తున్నట్లు సమాచారం. అల్యూమినియం సహా కీలక వ్యాపారాలను ప్రత్యేక లిస్టెడ్ కంపెనీలుగా విభజించే దిశగా కసరత్తు జరుగుతుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఆయా సంస్థల అసెట్స్ నిష్పత్తికి అనుగుణంగా విభజించిన కంపెనీలకు రుణాల కేటాయింపు జరగనున్నట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై రుణదాతలతో వేదాంత జరుపుతున్న చర్చలు తుది దశలో ఉన్నాయని, ప్రక్రియ సజావుగా సాగుతోందన్నారు. రుణ కేటాయింపులకు సంబంధించి రుణదాతల తరఫున ఎస్బిఐక్యాప్స్ చర్చలు జరుపుతోందని, త్వరలోనే ఎన్ఒసిలు లభించే అవకాశం ఉందని వివరించారు. మెటల్స్, విద్యుత్, అల్యుమినియం, ఆయిల్ అండ్ గ్యాస్ వ్యాపారాల్లో అవకాశాలను మరింతగా అందిపుచ్చుకునే క్రమంలో ఆయా విభాగాలను విభజించనున్నట్లు గతేడాది సెప్టెంబరులో వేదాంత ప్రకటించిన విషయం తెలిసిందే.