ఫొటో : నల్లరిబ్బన్లతో మౌన ప్రదర్శన చేపడుతున్న అంగన్వాడీలు
అంగన్వాడీల మౌన ప్రదర్శన
ప్రజాశక్తి-కావలి రూరల్ : అంగన్వాడీ టీచర్లు వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం 12వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా కావలి పట్టణంలో ఎంపిడిఒ కార్యాలయం వద్ద నుండి నల్ల రిబ్బన్లు నోటికి కట్టుకొని మౌన ప్రదర్శనగా బయల్దేరి ఉదయగిరి రోడ్డు సెంటరు కోర్టు బిపిఎస్ సెంటరు మీదుగా ఆర్టిసి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన కొనసాగింది. అనంతరం సిఐటియు నాయకులు మాట్లాడుతూ గత 12రోజుల నుండి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఉలుకూపలుకు లేకుండా ఉందని ఇది రాష్ట్ర ప్రభుత్వానికి తగదని వారి న్యాయమైన డిమాండ్లను ముఖ్యమంత్రి వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో 26వ తేదీ నుండి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు పసుపులేటి పెంచలయ్య, వ్యకాసం నాయకులు తుమ్మల వెంకయ్య, సిఐటియు నాయకులు నరహరి, వై.కృష్ణమోహన్, అంగన్వాడీ వర్కర్లు విజయలత, కె.సుభాషిణి, టీవీ శేషమ్మ, బివి రమణమ్మతో పాటు పెద్ద సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు.