వేమిరెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న దృశ్యం
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించండి..
ప్రజాశక్తి -నెల్లూరు : సిఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గతంలో చేసిన హామీలు అమలు చేయాలని కోరుతూ చేస్తున్న నిరవధిక సమ్మె మంగళవారం 36వ రోజుకు చేరాయి. భోగి, సంక్రాంతి, కనుమ పండుగల రోజు సైతం కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలు చేస్తున్న దీక్షలు చేస్తూ తమ నిరసన తెలిపారు. సిఐటియు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు సంయుక్తంగా మాజీ మంత్రి అనీల్కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిని వారి వారి క్యాంపు కార్యాలయాల్లో కలిసి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలని వినతిపత్రాలను అందజేశారు. నెల్లూరు ఎంపి ఆదాల ప్రభాకర్రెడ్డి క్యాంపు కార్యాలయంలో వైసిపి నాయకులు కొండ్రెడ్డి రంగారెడ్డి, పలువురు వైసిపి కార్పోరేట్లను కలిసి వినతిపత్రం అందజేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె అజరుకుమార్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా తమ వేతనం రూ. 26వేలు ఇవ్వాలని, సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి గ్రాట్యుటీ అమలు చేయాలని, మినీ సెంటర్స్ని మెయిన్ సెంటర్స్లో ప్రమోట్ చేయాలని కోరారు. వర్కర్స్ తో సమానంగా వేతనం ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ రూ. 5 లక్షలకు పెంచాలని, వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని, ప్రమోషన్ వయోపరిమితిని 50 సంవత్సరాలకు పెంచాలని,సర్వీస్లో ఉండి చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. బీమా సౌకర్యం కల్పించాలన్నారు. కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శి జి.నాగేశ్వరరావు, సిఐటియు రూరల్ అధ్యక్షులు కొండా ప్రసాద్, పి.సూర్యనారాయణ, సంపూర్ణమ్మ, కుమారి, సుమతి ఉన్నారు.