ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : సిఎం జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె శుక్రవారం నాటికి 11వ రోజుకు చేరుకుంది. సమ్మె సందర్భంగా కలెక్టరేట్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి వినతి అందజేశారు. ఈ సందర్భంగా సమగ్రశిక్ష జెఎసి జిల్లా అధ్యక్షులు అధ్యక్షులు గురువులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతుంటే సమస్యలు పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేయడం దారుణమన్నారు. మరోవైపు కెజిబివి ఉద్యోగులకు మెమోలు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. బెదిరింపులకు భయపడేది లేదని, సమస్యలు పరిష్కరించేవరకు సమ్మె విరమించేది లేదని అన్నారు. సమ్మెకు టిడిపి జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున, సిఐటియు నాయకులు టివి రమణ, ఎపి అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు బి.పైడిరాజు మద్దతు తెలిపారు. నాగార్జున మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే ఉద్యోగులు సమస్యలు పరిష్కారం చేసి సమ్మె ను విరమింప చేయాలని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు టిడిపి మండల అధ్యక్షులు బొద్దల నర్సింగరావు తదితరులు ఉన్నారు.