అర్బన్ హెల్త్ సెంటర్లో ఆధునిక సేవలు
అందుబాటులో సీబీసీ, ఎలక్ట్రోలైట్ లాంటి అత్యాధునిక మెషిన్లు
రూ.300 నుంచి రూ.1000కి పైగా ఖర్చయ్యే అయ్యే పరీక్షలు ఉచితం
నేడు 62 రకాల పరీక్షలు నిర్వహణ
ప్రజాశక్తి- నగరి
మునిసిపల్ పరిధిలో రూ.80లక్షల వ్యయంతో నిర్మించిన అర్బన్ సెంటర్లు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తోంది. ఈ సెంటర్ల వద్ద ఒక డాక్టర్, ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఒక ఫార్మసిస్ట్, ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఒక డేటా ఆపరేటర్, ఒక అటెండర్ ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్యసేవలను అందిస్తున్నారు. పిల్లలకు అన్ని రకాల వ్యాక్సిన్లు ఈ సెంటర్లలో అందుబాటులో ఉన్నాయి.62 రకాల పరీక్షలు నిర్వహణ అర్బన్ సెంటర్లోని ల్యాబ్లలో 62 రకాల పరీక్షలను నిర్వహిస్తున్నారు. మలేరియా, టైఫాయిడ్, డెంగీ టెస్టులు, ప్లేట్లెట్స్ కౌంటింగ్ టెస్టు, కిడ్నీ సంబంధిత టెస్టు, యూరిన్, సోడియం, పోటాషియం టెస్టులు, డయాబెటీస్, హైపర్టెన్షన్ ఉండేవారికి లిక్విడ్ ప్రొఫైల్ టెస్టులు, స్పుటమ్ టెస్ట్ అంటూ 62 రకాల పరీక్షలు ఈ సెంటర్లలో నిర్వహిస్తున్నారు. వాటికి సంబంధిత కిట్లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రులలో సైతం లేని టెస్టింగ్ మెషిన్లు కార్పొరేట్ ఆస్పత్రులలో మాత్రమే అందుబాటులో ఉండే సీబీసీ మెషిన్లు, ఎలక్ట్రోలైట్ మెషిన్లు, బయోకెమిస్ట్రీ అనలైజర్, యూరిన్ అనాలసిస్ మెషిన్ లాంటి అత్యాధునిక టెస్టింగ్ మెషిన్లు, బ్లడ్ టెస్టింగ్ మెషిన్లు అర్బన్ హెల్త్సెంటర్లలో అందుబాటులో ఉన్నాయి. ఈ పరీక్షలు బయట చేసుకోవాలంటే ఎలక్ట్రోలైట్ సోడియం, పొటాషియం టెస్టు రూ.1000, లిక్విడ్ ప్రొఫైల్ టెస్టుకు రూ.600, యూనిన్ టెస్టు రూ.200, డెంగ్యూ టెస్టు రూ.600, టైఫాయిడ్ రూ.300, మలేరియా రూ.300 అంటూ చెల్లించాల్సి ఉంది. ఈ పరీక్షలన్నీ రోగులకు అర్బన్ హెల్త్ సెంటర్లలో ఉచితంగా చేస్తున్నారు సేవలను ప్రజలు వినియోగించుకోవాలి- డాక్టర్ రవిరాజు, డీఐఓ, చిత్తూరు కార్పొరేట్ ఆస్పత్రులలో మాత్రమే ఉండే అత్యాధునిక టెస్టింగ్ మెషిన్లు డాక్టర్ వైస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లలో ఉన్నాయి. నైపుణ్యం కలిగిన ల్యాబ్ టెక్నీషియన్లు, వైద్యులు ఉన్నారు. వేలకు వేలు పెట్టి చేసుకునే పరీక్షలన్నీ ఉచితంగా చేయడం జరుగుతుంది. పరీక్షలకు సంబందిత కిట్లు కూడా అర్బన్ సెంటర్లలో పుష్కలంగా ఉన్నాయి. ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలి.