ప్రజాశక్తి-బొండపల్లి : రానున్న ఎన్నికలో తనను ఆదరించి.. ఆశీర్వదిస్తే గజపతినగరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం టిడిపి ఆధ్వర్యాన కూటమి బొండపల్లి మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తాత కొండపల్లి పైడితల్లి నాయుడు జెడ్పి చైర్మన్గా, ఎమ్పిగా ప్రజలకు సేవలు అందించి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. తాను కూడా ఆయన బాటలో నడుస్తూ ఆశయ సాధనకు కృషిచేస్తానన్నారు. తన తాతయ్య, బాబాయిలను గెలిపించినట్లే తననూ ఆశీర్వదించాలని అభ్యర్థించారు. యువతకు ఉపాధి అవకాశాలు తీసుకు వస్తానని, రైతు సంక్షేమానికి పాటు పడతానని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మాజీ మంత్రి పడాల అరుణ మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని కూటమి కట్టినట్లు తెలిపారు. జనసేన నియోజకవర్గ నాయకులు మర్రాపు సురేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే అప్పలనరసయ్య అభివృద్ధి చెందారే తప్ప గ్రామాల అభివృద్ధి శూన్యమన్నారు. సమావేశంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు దేవర ఈశ్వర్ రావు, మాజీ ఎంపిపి కొండపల్లి కొండలరావు, మాజీ వైస్ ఎంపిపి బొడ్డు రాము, టిడిపి సీనియర్ నాయకులు శనపతి శ్రీనివాసరావు, బండారు కృష్ణమూర్తి, రాపాక అచ్చెంనాయుడు, కళ్యాణపు నారాయణరావు, తాళ్లపూడి రమణ, బోదంకి వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/bpl-1.jpg)