- నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు
ప్రజాశక్తి -కనిగిరి(ప్రకాశం) : కనిగిరి రెవిన్యూ డివిజనల్ అధికారి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి పాలపర్తి జాన్ ఇర్విన్ బుధవారం తన కార్యాలయంలో పొలిటికల్ పార్టీస్తో ఎన్నికల నియమావళిపై సమావేశాన్ని నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అందరూ సహకరించాలని సూచించారు. ప్రచారానికి సంబంధించి అనుమతులు లేకుండా చేపట్టారాదన్నారు. వాహనాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పార్టీ కార్యకలాపాలు నిర్వహించరాదని, ఉద్యోగులను పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించి వారి జీవితాలను ఇబ్బందుల్లో పడవేయొద్దని తెలిపారు. ఎటువంటి అసౌకర్యం కలగకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్క ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకునేలా తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఎటువంటి పొరపాట్లు జరిగిన ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. సివిజిల్ యాప్ను ఉపయోగించి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. ఈ సమావేశంలో టిడిపి అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్, పిడిసిసి బ్యాంక్ చైర్మన్ వై ఎమ్ ప్రసాద్ రెడ్డి, బిజెపి నాయకులు నరాల శ్రీనివాసరెడ్డి, సిపిఎం నాయకులు పిసికేశవరావు, బీఎస్పీ నాయకులు టి.ప్రభుదాస్, వివిధ పార్టీల నాయకులు, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.